కథకుడుగా పిచ్చేశ్వరరావును గురించి ఒక్క ముక్క చెప్పవచ్చు. అతను గొప్ప కథలు రాయాలని కనిపెట్టుకుని ఏ కథా రాయలేదు. సద్యఃప్రయోజనాన్ని మటుకే మనసులో పెట్టుకుని కథలు రాశాడు...నేనెరిగినంతలో అతని కథలు కనీసం నాలుగైదు ఉత్తమ తెలుగు కథానికా సాహిత్యంలో శాశ్వతంగా నిలవగలిగినవిగా ఉన్నాయి. - కొడవటిగంటి కుటుంబరావు
మనకు లెక్క లేనన్ని విశ్వ విద్యాలయాలున్నాయి. ‘‘తెలుగు కథానికా సాహిత్యంలో సాయుధ దళాల యితివృత్తాలు’’ అనే అంశాన్ని ఎవరైనా స్వీకరించి పరిశోధనలు చేస్తే పిచ్చేశ్వరరావు నేవీ కథలకు న్యాయం చేకూరుతుంది. ఆ నేపథ్యంలో పిచ్చేశ్వరరావు రచించిన ‘చిరంజీవి’ కథ మన తెలుగు కథానికా సాహిత్యంలో చిరంజీవే. -ఆరుద్ర,
పిచ్చేశ్వరరావు కథలు రాయడం కొనసాగించి ఉంటే తెలుగు సాహిత్యానికి ఒక మార్కెజ్ మిగిలేవాడు. ఈ తరం కథకులకు కథలెలా రాయాలో నేర్పే పాఠాలు ఈ కథలు.