తెలుగువారి గతంలోకి ప్రయాణం, 27 చిరుకథల సాయంతో
*చరిత్రని శోధించాలంటే H G వెల్స్ మహాశయుడు కల్పించిన టైం మషిన్ కంటే అనువైన పరికరం ఉండదు. కానీ మన దురదృష్టం, ఈనాటికీ అది ఆకాశహార్మ్యంగానే మిగిలింది. దానిని కనుగొనేవరకూ చరిత్రను తెలుసుకొనేందుకు, మానవుని ఊహాశక్తియే మనకి దారి. అది వాస్తవికత కంటే అద్భుత కాల్పనిక లోకాలకు దారితీయడం కద్దు.*
*సామాన్యుల జీవన సరళి గురించి చెప్పే చారిత్రక కథలు అరుదు. సామాన్యులు అంటే వాళ్ళు మన తాతముత్తాతలు. కానీ వారి వారసులమైన మనకి వాళ్ళ జీవనసరళి గురించి తెలిసింది మృగ్యం.*
*ఈ నేపధ్యంలో సాయి పాపినేని రచించిన ‘ఆంధ్రపథం' - A Journey through History 'ఒక సరికొత్త కోవలో మన తాతముత్తాతల కథలను మనకి అందిస్తుంది. గతం లోతుల్లోని రాతియుగానికి చెందిన సంస్కృతీ స్తరాలనుండి, ఆధునిక యుగారంభం వరకూ, కాల స్రవంతిలో వచ్చిన పరిణామాలకు అద్దంపట్టే కథల సమాహరమిది. ప్రతి కథకూ అనుబంధంగా ఆనాటి నేపధ్యాన్ని వివరించే వ్యాసాలు, చరిత్రపై పాఠకుల అవగాహనను మరింత పరిపుష్టం చేస్తాయి.*